Pages

Saturday 31 October 2015

వీరు మేధావులా? వెర్రి గొర్రెలా?!

 

సర్వానందకౌల్ ప్రేమి పేరు మోసిన కాశ్మీరీ కవి. అనంతనాగ్ జిల్లా సోఫ్‌షాలి గ్రామంలో అందరికీ ఇష్టుడై హిందువుల, ముస్లింల అభిమానాన్ని సమానంగా పొందిన పెద్దమనిషి. ఆయన పూజగదిలో ‘ఖురాన్’ పురాతన ప్రతి ఎప్పుడూ ఉండేది. ‘‘బతకాలని ఉంటే ముస్లింలుగా మారండి... లేదా కాశ్మీర్ లోయ వదిలి 24 గంటల్లో పారిపొండి’’ అని లోయ అంతటా అస్తమానం మసీదుల్లో మైకుల నుంచి అరుస్తున్నారు; ‘పారిపోకపోతే చంపేస్తామ’ని హిందువుల ఇళ్లూ, దుకాణాల మీద నోటీసులు అంటించారు. ఇప్పటికే వందల మందిని చంపేశారు. మనమూ వెళ్లిపోదాం - అని భార్యాబిడ్డలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా తమ జోలికి ఎవరూ రారని ప్రేమీజీ నిబ్బరంగా ఉంటుండగా...


1990 ఏప్రిల్ 29 రాత్రి ముస్లిం మిలిటెంట్లు ఆయన ఇంటి మీద పడ్డారు. ఇంట్లోని విలువైన వస్తువులు, నగా నట్రా అంతటినీ సూట్‌కేసులో పేర్చి, దాన్ని పెద్దాయన నెత్తిమీదే పెట్టి మోయిస్తూ తమ వెంట తీసుకుపోయారు. రెండురోజుల తరవాత ఆయన శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ప్రేమీజీ ఒళ్లంతా సిగరెట్ వాతలు, నుదుట తిలకం బొట్టు ఉండేచోట మేకుతో కొట్టిన రంధ్రం! కనుగుడ్లు పీకి చర్మం ఒలిచి కాల్చి చంపిన గుర్తులు.


ఈ వార్త దేశంలోని చాలా పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అయినా ఒక్క మేధావీ చలించలేదు. సాటికవిపై జరిగిన ఘాతుకానికి, ఆయనను బలిగొన్న మతద్వేషానికి, అసహిష్ణుతకు నిరసనగా ఒక్క సాహిత్యకారుడూ అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నానన లేదు. వేల సంవత్సరాల నుంచీ తరతరాలుగా నివసిస్తున్న గడ్డనుంచి కాశ్మీరీ పండిట్లు లక్షల సంఖ్యలో పారిపోయి, తమ దేశంలో తామే ప్రవాసులై పావు శతాబ్దంగా పడరానిపాట్లు పడటానికి కారకులైన ముస్లిం మతోన్మాదులను పల్లెత్తుమాట అనడానికి దేశంలోని ఏ సెక్యులరిస్టుకూ, ఏ లెఫ్టిస్టుకూ, ఏ పాచినోటి నీతుల రాయుడికీ నోరు పెగలలేదు. లోయలోని హిందువుల ఇళ్లపై వందల మంది విరుచుకుపడి కళ్లు పీకడం, బతికుండగానే చర్మం వొలవడం, నోట్లో మూత్రం పోయడం, స్ర్తిలను చెరచడం లాంటి రాక్షసకృత్యాలు ఎన్ని చేసినా సహిష్ణుత, మానవత్వం వగైరాలు మంటగలిశాయని ఒక్క కళాకారుడూ కన్నీటి బొట్టు విడవలేదు.


అదే - ఈ మధ్య దాద్రీ అదే ఊళ్లో ఒక మహమ్మదీయుడి ఇంటి మీద హిందువులు దాడిచేసి చంపేశారనేసరికి ఎక్కడెక్కడి మహానుభావులూ సెక్యులర్ పూనకంతో ఊగిపోతున్నారు. దాద్రీలో జరిగింది క్షమించరాని, కఠినాతికఠినంగా శిక్షించవలసిన దురాగతం అనడంలో సందేహం లేదు. కాని ఆ ఘటనలో మరణించిన అఖ్‌లాక్‌ను తలచుకుని శోకాలు పెడుతూ, రంకెలు వేస్తున్న వామపక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్, లిబరల్ తక్కుంగల మేధావి గణాలకు అదే ఉత్తరప్రదేశ్‌లో అదే దాద్రీకి దగ్గరలో ఇంచుమించుగా అదే కాలంలో కుప్‌గాంవ్ అనే ఊళ్లో ముస్లింలు కాల్చి చంపిన సంజు రాఠోడ్ అనే 15 ఏళ్ల బాలుడి సంగతి పట్టలేదు. దాద్రీలో ఆవును చంపినందుకు హిందువుల చేతిలో హతమైనట్టు చెప్పబడుతున్న అఖ్‌లాక్ నామస్మరణ చేస్తూ గావుకేకలు పెడుతున్న మహాత్ములకు అదే నెలలో మంగుళూరు దగ్గర మూదబిద్రిలో అక్రమ కబేళాలకు, విచ్చలవిడి గోవధకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రశాంత్‌పూజారిని ఆరుగురు మహమ్మదీయులు మోటారు సైకిళ్లమీద వచ్చి నడివీధిలో కాల్చి చంపటంలో మతద్వేషం, అసహిష్ణుత అణువంతైనా కానరాలేదు. ఆ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన వామన్‌పూజారి పాకిస్తాన్ ఫోన్ నెంబర్ల నుంచి వరసగా వస్తున్న బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఆందోళన చెందాల్సింది ఏమీ వారికి కనిపించలేదు.


ఇస్లామిక్ మతవాదుల వ్ఢ్యౌన్ని ధైర్యంగా ఎదిరించిన రచయిత్రిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తస్లిమా నస్రీన్ తల నరికిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమానాన్ని ముస్లిం మతపెద్దలు ప్రకటించడం హేతువుకు, సహిష్ణుతకు, మానవ హక్కులకు ప్రమాదంగా మన గావుకేకల బ్యాచికి తోచలేదు. ప్రాణభయంతో వచ్చి ఆమె తలదాచుకున్న కోల్‌కతా నుంచి కూడా ముస్లిం మతవర్గాల దాష్టీకానికి తల ఒగ్గి, వామపక్ష, ప్రగతిశీల విశుద్ధాత్ముల ప్రభుత్వం ఆమెను వెళ్లగొట్టటానికి నిరసనగా ఒక్క సాహిత్యకారుడూ ‘అవార్డ్ వాపసీ’ ప్రోగ్రాం పెట్టలేదు. హైదరాబాదులో ఆమె పుస్తకావిష్కరణ సభలో ముస్లిం లెజిస్లేటర్లు మూకను వెంటేసుకుని దారుణంగా దాడిచేయటం భావస్వేచ్ఛకు, మత సహిష్ణుతకు, హేతువాదానికి, సెక్యులర్ జీవన విధానానికి అపచారమని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న వారిలో ఏ ఒక్కడూ బాహాటంగా ఖండించిన పాపాన పోలేదు. ఇండియాకు శత్రువైన పాకిస్తాన్ వాడిని ఇండియాకు పట్టుకొచ్చి పుస్తకావిష్కరణ సభ పెట్టించిన సుధీంద్ర కులకర్ణి అనేవాడి మొగాన సిరా పోయడం నిష్కృతి లేని నేరమంటున్న వాచాలురకు ప్రెస్ కాన్ఫరెన్సులో రాందేవ్ బాబా మొగాన ఒక మహమ్మదీయుడు సిరా కుమ్మరించడంలో అనౌచిత్యం ఏమీ కనిపించలేదు.


మూడేళ్ల కింద ముంబయి శివార్లలోని క్రైస్తవ ప్రార్థనా స్థలంలో ఏసుక్రీస్తు విగ్రహం కాలివేళ్ల నుంచి నీటిబొట్లు రాలసాగాయి. అది దేవుడి మహిమగా ఆ మతం వాళ్లు ప్రచారం చేసుకున్నారు. ఎక్కడెక్కడి భక్తులూ ఎగబడి కారేనీరును పవిత్ర తీర్థంగా పుచ్చుకుంటుండగా దాని సంగతి తేలుస్తానని ఇదమరుకు అనే హేతువాద ప్రముఖుడు ముందుకొచ్చాడు. ఒక ఇంజనీరుతో పరీక్ష చేయించి, ఏసు విగ్రహం అమర్చిన గోడలో ప్లంబింగ్ లోపంవల్ల డ్రయినేజి నీరు ఊరుతున్నందువల్లే అలా జరిగిందని శాస్ర్తియంగా నిరూపించాడు. దానిపై దరిమిలా ఒక టీవీ చానల్ స్టూడియోలో క్రైస్తవ మతస్థులతో అతడు వాదులాడుతుండగా కేథలిక్కులు కట్టెలు పట్టుకుని అతడిని కొట్టటానికి స్టూడియో బయట గుమికూడారు. ఆ గండం నుంచి ఎలాగో బయటపడ్డా, అతడి మీద క్రైస్తవులు మూడు పోలీసుస్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టారు. ముందస్తు బెయిలు మంజూరు కాలేదు. జైలుకు వెళ్లినా చావు తప్పదని బెదిరింపులు ఎక్కువయ్యాయి. దాంతో ఇదమరుకు ప్రాణం దక్కించుకోవడానికి ఏదో మిషమీద ఫిన్లాండ్ పారిపోయాడు. స్వదేశానికి క్షేమంగా తిరిగి రాగల శుభదినం కోసం అతడు మూడేళ్లుగా హెల్సింకీలో ఎదురుచూస్తున్నాడు. నిందితులు క్రైస్తవ మైనారిటీలు కాబట్టి, ఆ హేతువాదిని అలా సతాయించడం హేతువుపై దాడిగా మన మహాహేతువాదులకు అనిపించలేదు. ఏ ఒక్కడూ ఒక్క పనికిమాలిన అవార్డునూ వదిలిపెట్టలేదు.

పోనీ- ఇప్పుడు వారు అనునిత్యం స్మరిస్తున్న ముగ్గురు హిందూ వ్యతిరేకులనైనా హిందూ మతోన్మాదులే చంపారనడానికి ఆధారాలున్నాయా? అంధ విశ్వాసాలను ఎదిరించటమే పనిగగా పెట్టుకున్న నరేంద్ర దభోల్కర్‌కు శత్రువులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి’ పేరిట మదర్ థెరిసా మహిమల బండారాన్ని ఆయన బయట వేశాడు. ఆమెను సెయింట్‌గా గుర్తించవద్దంటూ పోప్‌కు ఉత్తరం రాసి క్రైస్తవ వర్గాలకు కంటగింపు అయ్యాడు. దభోల్కర్‌ను చంపి రెండేళ్లయినా మోటారు సైకిళ్ల మీద వచ్చి అతడిని హతమార్చిన వారెవరన్నది తేల్చడం పోలీసుల తరం కాలేదు. అంజనం వేసి హంతకుడిని కనిపెట్టటానికి వారు ఒక తాంత్రికుడిని ఆశ్రయించారుగానీ ప్రయోజనం లేకపోయింది. అయితే నరేంద్రమోదీయే ఉసిగొలపగా హిందుత్వం వాలాలే దభోల్కర్‌ను పొట్టన పెట్టుకున్నట్టు మన హేతువాద, సెక్యులర్ గణాలు మాత్రం అంజనం వేయకుండానే దివ్యదృష్టితో కనిపెట్టాయ.

దభోల్కర్ చేతిలో శృంగభంగమైన వారిలో అమాంబాపతు బాబాలూ, నకిలీ స్వాములూ, లేకపోలేదు... తమ దారికి అడ్డొచ్చిన వారిని అంతమొందించాలని వారిలో ఎవరైనా అనుకుని ఉండరు అనటానికి వీల్లేదు. తమ ఆధ్యాత్మిక వ్యాపార స్వార్థం కోసం అలాంటి వారెవరైనా కక్షగట్టి ఒకవేళ అతడిని చంపించి ఉన్నా, ఆ పాపాన్ని హిందుత్వానికి కట్టుబడే శక్తులకు ఆపాదించడం న్యాయం కాదు. నకిలీ బాబాలు, కపట స్వాములు, విబూదుల, తాయెత్తుల, గారడీల మాయగాళ్లు అందరిదీ ఆరెస్సెసే కేరాఫ్ అడ్రసు అనో, వారంతా బిజెపి చేతిలో ఉన్నారనో నమ్మేసి, అభాండాలేసే వారి బుర్రలను అర్జంటుగా డాక్టరు పరీక్ష చేయించాలి.

అలాగే కమ్యూనిస్టు పార్టీకి చెందిన గోవింద్ పన్సారే ఎప్పుడో గాడ్సేను తిట్టాడు కనుక, హిందువులందరూ గాడ్సే భక్తులు కాబట్టి, హిందుత్వ శక్తులే అతడిని చంపించినట్టు మన మతి చెడ్డ మేధావుల దుష్ప్రచారం. కాని - పన్సారే హిందూ వ్యతిరేక నాస్తిక హేతువాది మాత్రమే కాదు. అడ్డగోలుగా టోల్‌టాక్సు వసూలు చేస్తున్న కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి, పెద్ద ఉద్యమం నడిపినవాడు. మహారాష్ట్ర ప్రభుత్వ ఎస్.ఇ.జడ్. విధానంపై ధ్వజమెత్తి, ప్రజల భూములు అప్పనంగా కాజేస్తున్న వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు ప్రబల శత్రువు అయినవాడు కూడా. అతడిని హిందుత్వ వాదులే చంపారు; అతడి హత్యలో ఇంకో కోణం ఏదీ లేదు అని మన బుద్ధిలేని బుద్ధి జీవులకు హత్య జరిగిన ఆర్నెల తరవాత హఠాత్తుగా జ్ఞానబోధ ఎలా అయింది? ఎవరు చేశారు? కర్ణాటకలో కల్బుర్గి హత్యలో కుటుంబ ఆస్తి గొడవల కోణంకూడా కొట్టివేయటానికి వీల్లేదని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులే చెబుతుండగా మోదీ పురమాయింపు మీద హిందుత్వ శక్తులే ఆ హత్య చేసినట్టు మన ‘సెక్యులర్’, ‘హిందూ వ్యతిరేక’ హేతువాద మేథావిగణం ఏ దివ్యదృష్టితో కనిపెట్టింది?

మోదీ అధికారంలోకి రావడానికి దాదాపు సంవత్సరం ముందు జరిగిన దభోల్కర్ హత్యతో మోదీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? పోలీసు, ప్రజాభద్రత రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. దభోల్కర్, పన్సారే, కల్బుర్గి హత్యలు జరిగినవి కర్నాటక, మహారాష్టల్ల్రో కాగా దాద్రీ ఖూనీ జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. కర్నాటక, యు.పి.ల్లో ఉన్నవి బిజెపి ప్రభుత్వాలేమీ కావు. సోకాల్డ్ హేతువాదులు, ఆవుల్ని తినేవాళ్లు ఎక్కడైనా హత్యలకు గురైతే వాటికి జవాబు చెప్పవలసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. వాటినేమో వదిలేసి, కేంద్రంలోని మోదీ సర్కారు మీదే అమాంబాపతు మేధావుల గ్యాంగు తుపాకులు ఎక్కుపెట్టటంలోని ఆంతర్యమేమిటి?

దేశంలో ఇప్పటిదాకా జరిగిన, ఇప్పుడూ లెక్క లేకుండా జరుగుతున్న దొమీల్లో, మత ఘర్షణల్లో మరణించిన ఏ ఒక్కడికీ ఇవ్వనంత ‘‘45 లక్షల రూపాయల ప్లస్ నాలుగు అపార్ట్‌మెంట్ల’’ పరిహారాన్ని దాద్రీ బాధిత ముస్లిం కుటుంబం అందుకున్న తరవాత కూడా దేశంలో మైనారిటీలకు దిక్కులేదని, మత సహిష్ణుతకు నిలవనీడ పోయిందని - ఒక్క దాద్రీ చూరునే పట్టుకుని గుండెలు బాదుకుంటున్న వారిని మేథావులు అనాలా? ఎవరు ఎలా నడిపిస్తే అలా నడిచే వెర్రి గొర్రెలు అనుకోవాలా?

సహేతుక కారణం ఒక్కటీ లేనిచోట, అభాండాలు వేసి, కాకుల్లా కేకలు పెట్టి, జరగరానిదేదో జరిగిపోతున్నట్టు ప్రపంచానికి అపోహను రేకెత్తించడానికి ఈ స్థాయిలో ఇంత ప్రచార యుద్ధం ఎందుకు జరుగుతున్నది? ఎవరు చేయస్తున్నారు? బీహార్‌లో బిజెపి గెలిచి తద్వారా రాజ్యసభలో బొటాబొటి మెజారిటీ పొంది కీలక సంస్కరణలతో మోదీ ప్రభుత్వం ప్రజల మెప్పుపొందకుండా చేయడానికే కీలక ఎన్నికల అదనులో ఈ కాకిగోల అంతా! కాంగ్రెసు మాతాసుతులిద్దరికీ ప్రత్యక్ష అవినీతి ప్రమేయం ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసులో సుబ్రహ్మణ్య స్వామి పూనికవల్ల జైలుశిక్ష తప్పదనుకుంటున్న రోజులివి. ఆ పరాభవానికంటే ముందే మోదీ ప్రభుత్వాన్ని, అతడి పార్టీని బద్‌నామ్ చేసి, గోబెల్స్ తరహా దుష్ప్రచారంతో అనిశ్చితిని, అరాచకాన్ని తెచ్చిపెట్టటానికి కాంగ్రెసు, దానికి తోడుబోయిన చెల్లని పార్టీల ఆధ్వర్యంలో పెద్దకుట్ర జరుగుతున్నది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఐదేళ్ల పూర్తికాలం కొనసాగనివ్వకుండా మధ్యలోనే అధర్మంగా సాగనంపి, బందిపోట్ల స్వర్గమైన కాంగ్రెసు దొంగల రాజ్యాన్ని ఇటలీ మహారాణి సర్వం సహాధిపత్యంలో ఎంత త్వరగా మళ్లీ తీసుకురావాలా అని మిషనరీలు, ముల్లాలు, కామ్రేడ్లు, మోదీ మూలంగా నోటి కూడుపోయిన విదేశభక్త ఎన్జీవో రాయుళ్లు, వారివారి విదేశీ ప్యాట్రన్లు తహతహలాడుతున్నారు. వారు పథకం ప్రకారం తవ్విపెట్టిన గోతిలో బుర్రలేని సాహిత్యకారులు, గొర్రెల్లాంటి కళాకారులు, సినిమాల శాల్తీలు, చరిత్ర తెలియని చరిత్రకారులు కాంగ్రెసు జమానాలో ఉపకారాలు పొందిన శాస్తవ్రేత్తలు, సైన్యాధికారులు, న్యాయమూర్తులు కళ్లు తెరచుకునే పడుతున్నారు. అన్నీ తెలిసిన కాంగ్రెసు పెద్ద ప్రణబ్ ముఖర్జీయే దేశంలో మతసహిష్ణుత, హేతుబద్ధత, ప్లూరలిజాలకు కొంప మునిగిందంటూ ఈ మధ్య తరచూ పనిగట్టుకుని నొక్కి చెప్పటంలోని మతలబు ఏమిటి అని క్షణం ఆలోచిస్తే చాలు అసలు గుట్టు బోధపడుతుంది. సూడో సెక్యులరిస్టుల, మీడియా మాయావుల మాయాజాలంలో పడిపోయిన వారికి కళ్లు విచ్చుకుంటాయి... నిజాన్ని చూడాలన్న నిజాయతీ అనేది వారికి ఉంటేగింటే!

 

ఏం.వి.ఆర్ శాస్త్రి

ఆంధ్ర భూమి

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...